డీఎస్సీ పరీక్ష రద్దు చేయాలనడం హాస్యాస్పదం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ప్రతిపక్ష పార్టీలు నిరుద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సింది పోయి వారిని అయోమయానికి గురి చేస్తున్నాయని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఇందిరా భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం మారినా బీఆర్ఎస్ బుద్ది మారడం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా రెండుసార్లు నిర్వహించాల్సిన టెట్ పరీక్షను నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించి నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు.వాళ్ళు చేయని పని కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నందుకు సంతోష పడాల్సింది పోయి నిరుద్యోగులను ఆందోళన గురి చేయడం సరికాదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అమలు చేయడం తో పాటు ప్రైవేట్ సెక్టార్ లో సైతం నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని హామీ ఇచ్చారు.రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు అయిన తర్వాత 30 వేల మంది నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. మరోవైపు గ్రూప్ -1 ప్రిలిమ్స్ పూర్తి చేశామని గ్రూప్ 2 పరీక్షలు సైతం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేసారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నోటిఫికేషన్ కు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలని మార్పులు చే స్తే న్యాయ స్థానం జోక్యం చేసుకుంటుందన్నారు. జులై 18 నుండి డీఎస్సీ పరీక్ష ప్రారంభం అవుతుందని ఇప్పటికే హల్ టికెట్స్ సైతం డౌన్లోడ్ చేసుకొని పరీక్ష రాసేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అలాంటిది ఇప్పుడు డీఎస్సీ పరీక్ష రద్దు చేయాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.