మాసం చేపలు వడ్డించలేదని పెళ్లిని రద్దు చేసుకున్న వరుడు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని డియోరియా జిల్లా ఆనంద్ నగర్ గ్రామంలో గురువారం ఈ షాకింగ్ ఘటన జరిగింది. దినేష్ శర్మ కుమార్తె సుష్మను వివాహం చేసుకునేందుకు వరుడు అభిషేక్ శర్మ అతడి కుటుంబ సభ్యులు ఆనంద్ నగర్ గ్రామానికి చేరుకున్నారు. అయితే పెళ్లిలో మాంసాహారం లేదనే విషయం వరుడికి తెలియడంతో అతడు ఆగ్రహంతో రెచ్చిపోయాడు. అప్పటివరకు అంతా సవ్యంగానే జరిగింది. పెళ్లి వేడుకలో భాగంగా దండల మార్పిడి కూడా జరిగింది. కానీ నాన్ వెజ్ లేదనే కారణంతో పెళ్లి కొడుకు, అతడి కుటుంబ సభ్యులు దాడికి తెగబడ్డారు. మాంసాహారం లేదంటూ పెళ్లి కొడుకు అభిషేక్ శర్మ, అతడి తండ్రి సురేంద్ర శర్మ, రాంప్రవేష్ శర్మ, రాజ్కుమార్ అనే వ్యక్తులతో పాటు మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు వధువు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. గొడవ ముదరడంతో దాడికి దిగారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వధువు తండ్రి పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. వరకట్నం కూడా భారీగా ఇచ్చామని, నగదు రూపంలో రూ.5 లక్షలు, కారు కొనేందుకు రూ.4.5 లక్షలు ఇచ్చామని, రెండు బంగారు ఉంగరాలు కూడా ఇచ్చారని దినేశ్ శర్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ కొట్లాటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం, కొట్టుకోవడం, కుర్చీలు విసురుకోవడం కనిపించింది.